పెదపాడు: దెందులూరు వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ముందు వరుసలో రామ్మోహనరావు అనే డ్రైవర్ ట్రాక్టర్ ఇంజిన్పై ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టుకొని అత్యుత్సాహంతో రౌండ్లు వేయాలని చూశాడు. దీంతో అది పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. వెంటనే కార్యకర్తలు చెరువులోకి దూకి వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తొందూరు నిఖితేశ్వర్, గుండుబోయిన దుర్గశ్రీ మణికంఠలు అపస్మారక స్థితికి చేరారు. అబ్బయ్యచౌదరి అక్కడికి చేరుకొని బాలురను తన కారులో ఏలూరులో ఆసుపత్రికి తరలించారు. నిఖితేశ్వర్ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి పంపారు.