- ఎస్టి సాధన కోసం చట్టసభల్లో మాట్లాడుతా
- వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ
ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి వాల్మీకులకు రాజకీయ గుర్తింపును ఇచ్చారని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జెవిఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం టిడిపి ఎంపి అభ్యర్థి పార్థసారథితో కలిసి వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత వాల్మీకులను ఎంపి, ఎమ్మెల్యేలను చేసి చట్ట సభల్లోకి పంపారన్నారు. నాటి నుంచి నేటి వరకు వాల్మీకులందరూ టిడిపికి అండగా నిలిచారన్నారు. అందువల్లే అనంతపురం ఎంపి స్థానాన్ని హిందూపురం వాసి అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించినట్లు తెలిపారు. వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చడం కోసం తనతోపాటు టిడిపి ప్రజా ప్రతినిధులు అందరూ చట్టసభల్లో గళం విప్పుతారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాల్మీకులందరూ టిడిపికి అండగా నిలవాలని కోరారు.