హోదా, విభజన హామీలపై మీ వైఖరేంటీ?

– ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :ప్రత్యేక హోదా, విభజన హమీల చట్టం అమలుపై వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు వారి విధానం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేకహోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన సంఘాల జెఎసి ఆధ్వర్యంలో సిఎం నివాసం ముట్టడి కార్యక్రమంలో భాగంగా సిఎం క్యాంపు కార్యాలయానికి వెళుతున్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావును, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మరో 12 మందిని తాడేపల్లిలో అరెస్ట్‌ చేసి, మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్‌లో ఉన్న నాయకులను, తాడేపల్లిలో గృహ నిర్భందంలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పరామర్శించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వారి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి బిజెపికి వంతపాడుతున్నాయన్నారు. ప్రజలను మోసం చేస్తున్న మూడు పార్టీలు ఇప్పటికైనా బిజెపితో రాజీపడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని కోరిన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయకుండా మోసం చేసిన బిజెపిని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకపోవడం దేనికి సంకేతమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేస్తున్న బిజెపి విధానంపై మూడు పార్టీలు నామమాత్రంగానే పోరాటం చేస్తున్నాయని విమర్శించారు.

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రామరాజ్యం అంటే ఇచ్చిన మాట తప్పడమా? అని ప్రశ్నించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. విభజన హామీల సాధన కోసం ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న నాయకులను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి.రాఘవులు, సిపిఐ నాయకులు పరామర్శించారు. పోలీసుల అరెస్టులను ఖండించారు. మధ్యాహ్నం నాయకులను విడుదల చేశారు.

➡️