తెలంగాణ : ‘పార్టీలో నిఖార్సయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం’ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బిఆర్ఎస్ లో జరుగుతున్న తాజా పరిస్థితులపై కెటిఆర్ ట్వీట్ చేశారు. శూన్యం నుంచి సునామీ సఅష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కెసిఆర్ అని కెటిఆర్ కొనియాడారు. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ది అని కితాబునిచ్చారు. అలాంటి ధీరుడు కెసిఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి… తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కెసిఆర్ ను, బిఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని అన్నారు. పార్టీలో నిఖార్సయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాట పంథాలో కదం తొక్కుదామని కెటిఆర్ పిలుపునిచ్చారు.