ప్రియురాలికి పెళ్లి కుదిరిందని ప్రేమికుడు ఆత్మహత్య

Dec 1,2023 16:42 #Bapatla District, #Suicide
young person suicide in bapatla

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : ప్రేమించిన యువతికి పెళ్లి కుదిరిందని మనస్థాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా
మార్టూరు రూరల్ మండల పరిధిలోని బొల్లాపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు యువకుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జె పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన వల్లెపు పిచ్చయ్య,బుజ్జి దంపతుల పెద్ద కుమారుడైన అంకమ్మ (20) గుజరాత్ లోని ఓ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మార్టూరులోని ఓ పాఠశాలలో తనతో పాటు 10 వరకు చదువుకున్న బొల్లాపల్లి గ్రామానికి చెందిన యువతితో అనుబంధం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరూ బొల్లాపల్లి గ్రామంలోని ఓ గుళ్లో పెళ్లి చేసుకొని యువతి ఇంటికి వెళ్లడంతో వారు యువకుడిని మందలించి వారి ఇంటికి పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంకమ్మతో సదరు యువతితో వివాహం చేయడం ఇష్టం లేని వారి తల్లిదండ్రులు మరో సంబంధం చూసి వివాహం చేయాలని ప్రయత్నాలు చేయడంతో ఆ యువతి అంకమ్మకు సమాచారం ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అంకమ్మ బొల్లాపల్లి వెళ్లి యువతి ఉంటున్న ఇంటికి సమీపంలోనిం కుమ్మరి బావి దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా దూకాడు. తెల్లవారుతుండగా ఒక్కసారిగా బావిలో నుండి పెద్ద శబ్దం రావడంతో గమనించిన స్థానికులు యువకుడిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే అంకమ్మ మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మార్టూరు ఎస్ఐ ముసలం శ్రీనివాసరావు మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

కొండ మంజులూరులో విషాద ఛాయలు

చిన్నతనం నుండి చదువులో ప్రతిభ చాటుతూ ఉన్నత విద్య కోసం గుజరాత్ లో ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చదివి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాడుకున్న కొడుకు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ తల్లి తండ్రులు తల్లడిల్లిపోయారు. మార్టూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద వారు విలపించిన తీరు పలువురిని కలచివేసింది. అంకమ్మ స్వగ్రామం కొండ మంజులూరు బిసి కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

➡️