ప్రజాశక్తి- గజపతినగరం (విజయనగరం) : పాము కాటుతో వైసిపి నాయకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వైసిపి గజపతినగరం మండల నాయకుడు, మార్కెటింగ్ ఆత్మ కమిటీ చైర్మన్ సామంతుల పైడిరాజు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లారు. అక్కడ ఆయన పాముకాటు గురై స్పృహ కోల్పోవడంతో విజయనగరంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ఉదయం పైడిరాజు మృతి చెందారు. ఆయన లోగిశ గ్రామంలో వైస్ సర్పంచిగా పనిచేశారు. 2012లో కొన్ని కారణాల వల్ల టిడిపిని వీడి కాంగ్రెస్లో చేరి ఆ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో లోగిస బంగారునాయుడు గెలుపునకు కృషి చేశారు. బంగారునాయుడు మరణం అనంతరం వైసిపిలో చేరి గ్రామంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.