ప్రజాశక్తి-బాపట్ల జిల్లా :టిడిపి బాపట్ల అభ్యర్థి నరేంద్రవర్మకు చెందిన రొయ్యల కంపెనీ (రాయల్ మెరైన్ ప్రయివేట్ లిమిటెడ్) కంటైనర్లోని రూ.56 లక్షల నగదును చీరాల పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు..భీమవరం నుంచి నిజాంపట్నం మీదుగా చీరాల మండలం, కావూరివారిపాలెం వద్ద ఉన్న రొయ్యల కంపెనీకి భారీ ఎత్తున నగదు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రొయ్యల కంపెనీ వద్ద ఆ కంటైనర్ను పోలీసులు తనిఖీ చేశారు. రూ.56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్కు సదరు నగదును పోలీసులు అప్పజెప్పారు. తమ కంపెనీ జీతాల కోసం సదరు నగదు తెప్పించడం జరిగిందని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ సొమ్మును ట్రెజరీలో జమ చేస్తామని డిఎస్పి బేతపూడి ప్రసాద్ తెలిపారు.