న్యూఢిల్లీ : ఇజ్రాయిల్, ఇరాన్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలకు ప్రయాణం చేయవద్దని పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక అత్యవసర సర్క్యులర్ను శుక్రవారం విడుదల చేసింది. ‘ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీసు విడుదల చేసేవరకూ భారతీయులందరూ ఇజ్రాయిల్, ఇరాన్కు వెళ్లవద్దని సూచిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు అక్కడ రాయబార కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ రెండు దేశాల్లో ఉంటున్న భారతీయులు తమ భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కూడా కేంద్ర విదేశాంగ శాఖ కోరింది.