ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : సుదీర్ఘకాలంగా 25 సంవత్సరాలపాటు సైకిల్ గుర్తుపై నెగ్గి తాళ్లరేవు నియోజకవర్గాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన చిక్కాల రామచంద్రరావు ఆదివారం సరదాగా స్కూటర్ ఎక్కారు. తాళ్ళరేవు మాజీ ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి, లక్ష్మణరావు దంపతులు ప్రత్యేకంగా మూడు బజాజ్ కబ్ స్కూటర్లను ప్రచార రథాలుగా సిద్ధం చేశారు. ఆ స్కూటర్లపై మాజీ మంత్రి చిక్కాల, ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, టేకుమూడి లక్ష్మణరావు ఎక్కి కోరంగి పంచాయతీలో కాళికాదేవి గుడి వద్ద నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. పొట్టి స్కూటర్లు ఆకర్షణీయంగా ఉండడంతో పలువురు ఆ స్కూటర్ల పైకెక్కి సెల్ఫీలు దిగడానికి కార్యకర్తలు, యువత పోటీలుపడ్డారు. దీంతో మూడు స్కూటర్లు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.