ప్రజాశక్తి-పాడేరు: స్వచ్ఛమైన గిరిజన ప్రాంతం, అందమైన ప్రకృతి ఒడిలో సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట్ అధ్యక్షతన బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ను అన్ని ప్రభుత్వ శాఖల, రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరి సహకారంతో పక్కా వ్యూహంతో ఎన్నికల విధులను విజయ వంతంగా నిర్వహించామని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా సువిశాలమైనదన్నారు. నాలుగు నెలలు అధికారులతో పని చేసానని తెలిపారు. పొలిటికల్ పార్టీలు, పాత్రికేయులు చక్కని సహకారం అందించారని కొనియాఆరు. ఎన్నికల నేపధ్యంలో సామాజిక పింఛన్లు, వైద్యపరమైన సేవలలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామన్నారు. జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు ఎన్నికల సమయంలో చక్కని సహకారం అందించారని పేర్కొన్నారు.అమ్మవారి జాతరను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించగలి గానన్నారు.జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా ఎన్నికలు నిర్వహణలో జిల్లా కలెక్టర్ తమకు అండగా నిలిచి నిరంతరం సహకారం అందించారని చెప్పారు. ఎప్పటికప్పుడు సూచనలు చేసేవారని చెప్పారు.జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.రంపచోడవరం ఐటిడిఏ పిఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ఎన్నికలను విజవంతం చేసామన్నారు. రంపచోడవం సబ్ కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తూ కలెక్టర్ అందించిన సహకారంతో ఎన్నికలను విజయవంతం చేసామన్నారు. పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ, బౌగోళికంగా అతిపెద్ద జిల్లా, సెక్యూరిటీ సమస్యలున్నప్పటికి సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఆర్డిఓ చైతన్య, ఎస్పీ ధీరజ్, డిఆర్ఓ బి. పద్మావతి, ఎస్డిసిలు వివిఎస్ శర్మ, భవాని, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డివిఆర్. ఎం.రాజు, డి. ఆర్.డి.ఏ .పిడి మురళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ భాషా, జిల్లా వ్యవసాయాధికారి నంద్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకలు ఐ.కొండలరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
![సత్కరిస్తున్న జాయింట్ కలెక్టర్, అధికారులు](https://prajasakti.com/wp-content/uploads/2024/06/colle-6.jpg)