ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయవాడ పటమటలోని సిఆర్ఎంసి ఇండోర్ స్టేడియంలో అండర్-19 (బాలురు, బాలికలు) జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటు జరగనుంది. 25 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 33 టీమ్లు పోటీల్లో పాల్గొననున్నాయి. 164 మంది బాలురు, 161 మంది బాలికలు మొత్తం 325 మంది క్రీడాకారులతోపాటు 100 మంది సాంకేతిక సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, రవాణా తదితర సౌకర్యాలు ఏర్పాట్లు పూర్తిచేశారు. టోర్నమెంటుకు జాతీయ పర్యవేక్షకునిగా యుపికి చెందిన రాజు రాణా నియమితుల య్యారు. నాలుగు రాష్ట్రాలకు ఒక ప్రత్యేక కో-ఆర్డినేషనల్ అధికారిని నియమించారు. 67వ ఎపి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంటు ప్రారంభోత్సవం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నగరంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతుంది.