తెలుగోడికి ఎస్‌బిఐ పగ్గాలు..!

Jun 29,2024 21:05 #Business

నూతన ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు
న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) సారథి బాధ్యతలు తొలిసారి ఓ తెలుగు వ్యక్తికి దక్కనున్నాయి. ఆ బ్యాంక్‌ తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆయన మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామాక సంస్థ అయినా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్స్‌ట్యూషన్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబి) ఎస్‌బిఐ తదుపరి చైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేస్తూ సిఫార్సు చేసింది. పనితీరు, మొత్తం అనుభవం, వివిధ కొలమానాలను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాసులును ఛైర్మన్‌ పదవికి సిఫార్సు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఐబి శనివారం తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కాగా.. దీనికి కేంద్ర కేబినెట్‌ కమిటీ, ప్రధానీ నరేంద్ర మోడీ తుది ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ఎస్‌బిఐ ఛైర్మన్‌ పదవీ కోసం ముగ్గురు మేనేజింగ్‌ డైరెక్టర్లను ఎఫ్‌ఎస్‌ఐబి ఇంటర్యూ చేసింది. ప్రస్తుత ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా 2020 అక్టోబర్‌లో నియమితులు కాగా.. ఆయన పదవీకాలం 2024 ఆగస్టు 28తో ముగియనుంది.
శ్రీనివాసులు సెట్టి 2020లో ఎస్‌బిఐ బోర్డులో ఎండిగా చేరారు. ప్రస్తుతం ఆయన ఎస్‌బిఐ అంతర్జాతీయ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన శ్రీనివాసులు శెట్టి అగ్రికల్చర్‌ సైన్స్‌లో డిగ్రీ పొందిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బిఐలో తన కేరీర్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. 36 ఏళ్లు పైగా సాగిన కెరీర్‌లో కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌, డిజిటల్‌, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, అభివృద్థి చెందిన దేశాల మార్కెట్‌లలోని బ్యాంకింగ్‌లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. న్యూయార్క్‌లోని విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించడానికి సిఫార్సులు చేయడానికి ఎఫ్‌ఎస్‌ఐబి బాధ్యత వహించే స్వయంప్రతిపత్త సంస్థ. 2022లో ఏర్పాటైన ఈ బ్యూరోకి పర్సనల్‌, ట్రైనింగ్‌ శాఖ మాజీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మ ఛైర్మన్‌గా ఉన్నారు, ఆర్థిక సేవల విభాగం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.

➡️