ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్వగృహంలో మహిళా పారిశుధ్య కార్మికులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వెల్లడించారు. గురువారం కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నగరంలో పారిశుధ్య పరిరక్షణలో మహిళా కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ప్రతిరోజు నగరంలో చెత్తాచెదారాలను సేకరిస్తూ పరిశుభ్ర వాతావరణన్ని నెలకొల్పతున్నారన్నారు. అట్టివారిని గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు తెలపనున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో 170 మంది మహిళా కార్మికులు ఉన్నారని వారందరికీ శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చాలి ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు.