సమ్మెను జయప్రదం చేసిన అంగన్వాడీలకు సిపిఎం అభినందనలు

Jan 23,2024 15:16 #Anganwadi strike, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడీ ఉద్యోగులు గత 42 రోజులుగా పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి, తమ కోర్కెలు సాధించుకున్నందుకు సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అభినందనలు తెలియచేశారు. సమ్మెకు సంఘీభావం ప్రకటించిన సంఘాలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. ప్రభుత్వం జీతాలు పెంచడానికి అంగీకరించి అంగన్వాడీ సంఘాలతో ఒప్పందం చేయడం హర్షణీయమని, అంగీకరించిన అంశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎటువంటి కక్షసాధింపులకు పాల్పడరాదని ఆయన కోరారు. ఎస్మాను ధిక్కరించి నిలబడ్డారని, ఉద్యోగాలు పీకివేస్తామని, కొత్త రిక్రూట్మెంట్‌ చేసుకుంటామని నోటీసులిచ్చి భయపెట్టి, బెదిరించినా అంగన్వాడీ వర్కర్లు లొంగలేదని ఆయన అన్నారు. ఇన్నిరకాల నిర్బంధాలను, రాష్ట్ర ప్రభుత్వ కుయుక్తులను సంఘం అండతో ఉమ్మడిగా ఉద్యోగులంతా ఒక్కటై ఎదిరించడం అభినందనీయమన్నారు.

➡️