సవరవిల్లి సంతలో అగ్నిప్రమాదం

  ప్రజాశక్తి-భోగాపురం  :  మండలంలోని సవరవిల్లి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 25 పాకలు దగ్ధమయ్యాయి. ఈ గ్రామంలో జాతీయ రహదారి ఆనుకొని మాజీ సర్పంచ్‌ ఇమంది కూర్మారావు స్థలంలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చిరు వ్యాపారులు చిన్న పాకలు వేసుకొని వ్యాపారం సాగిస్తుంటారు. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించగా, ఆ సంతలో పాకలన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యువత, మహిళలు మంటలు వ్యాపించకుండా ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎక్కువ గాలివీయడంతో భారీగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి తర్వాత ఫైర్‌ ఇంజన్‌ అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ పాకలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సర్పంచ్‌ ఉప్పాడ విజయభాస్కర్‌ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని, ఘటనపై ఆరా తీశారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.

➡️