సదస్సులో మాట్లాడుతున్న జెఎన్టియు ఉపకులపతి రంగజనార్ధన
ప్రజాశక్తి-అనంతపురం
సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హతకు తగ్గ ఉపాధి అవకాశాలకు వెళ్లాలని జెఎన్టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వర్శిటీ ఆడిటోరియంలో కర్నూలు ఎపి గవర్నమెంట్ రీజినల్ ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో అనంతపురం జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ‘కేరీర్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటిటివ్ ఎక్సమినేషన్స్’ విషయంపై ఒక్కరోజు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యని చదువుకుంటూ సరైన అవగాహనతో ఏ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నాయో తెలుసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. డిగ్రీ అర్హతకు తగ్గ ఉద్యోగాలకు వెళ్లాలేగానీ, అంతకంటే తక్కువ ఉద్యోగాలకు వెళ్లకూడదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రప్రథమంగా సన్నద్దం కావడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. రెక్టార్ ఎం.విజయకుమార్ మాట్లాడుతూ మీ లక్ష్యం నిర్ధేశించుకుని దానికి తగ్గట్టుగా కష్టపడి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరియర్ పట్ల చదువుతున్నప్పుడే అవగాహన పెంచుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. నోటిపికేషన్ విడుదల అయినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సి.శశిధర్, కర్నూలు రీజినల్ ఎంప్లారుమెంట్ ఆఫీసర్ పి.ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ ఎస్వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఇ.అరుణకాంతి, వర్శిటీ ఫారిన్ అఫైర్స్ డైరెక్టర్ పి.సుజాత, మాజీ ఆచార్యులు వి.శంకర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎ.పి.శివకుమార్, కళాశాల నుంచి ఎస్.చంద్రమోహన్రెడ్డి, ఎం.అంకారావు, కళ్యాణి రాధ, దిలీప్కుమార్, అజిత, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.