కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్
అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ డా||వి.వినోద్కుమార్ తెలియజేశారు. వెలగపూడి ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం నాడు పింఛన్ల పంపిణీ, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, డీపీవో ప్రభాకర్ రావు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఒకటో తేదీనే 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావాలన్నారు. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఖచ్ఛితంగా పింఛన్ల పంపిణీ మొదలు కావాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అన్ని విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన నగదు పూర్తిగా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని పాయింట్ పర్సన్లకు అప్పగించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ అడ్మిన్ అసిస్టెంట్ అజంతుల్లా పాల్గొన్నారు.