– పెట్రోల్ బంకు వెళుతూ చెట్టును ఢీకొన్న వైనం
– వాడరేవు రహదారిలో ఘటన
ప్రజాశక్తి-చీరాల : ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పూర్తిగా ఖాళీ అవటంతో ఎక్సెలేటర్ పెంచుతూ పెట్రోల్ బంకు చేరుకోవాలనే హడావుడిగా వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టడంతో ఓయువకుడు మృత్యు ఓడికి చేరుకున్నాడు.ఈ సంఘటన చీరాల మండలం వాడరేవు రహదారిలో బుధవారం జరిగింది.అందిన వివరాల మేరకు.. చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శశిధర్ (20) అనే యువకుడు తన ద్విచక్ర వాహనంలో పెట్రోలు పూర్తిగా అయిపోగా వాహనాన్ని చౌక లో వేసుకొని వాడరేవు నుండి చీరాల రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు బయలుదేరాడు.అయితే ద్విచక్ర వాహనం ఆగిపోతూ ఉండటంతో ఎక్స్ లెటర్ పెంచుతూ వేగంగా నడుపుతూ ప్రమాదవశాత్తు రోడ్డు వెంట ఉన్న చెట్టుకు ఢీకొని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.విషయం గమనించిన స్థానికులు శశిధర్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఏరియా వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.