ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : లంకాపట్నం వడ్ల పోలమాంబ గుడి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు, కార్పొరేటర్ కంటభుక్త తవిటి రాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, స్థానిక కార్పొరేటర్ పొట్నూరు శ్రీనివాసరావు తదితరులు పరామర్శించి అవసరమైన నిత్యవసరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సూచనలతో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించామన్నారు. నిత్యవసర సరుకులు, బట్టలను అందజేశామన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. అగ్నిప్రమాదం సంభవించడం దురదృష్టకరమని, బాధితులకు పూర్తి భరోసా, ధైర్యాన్ని కల్పించామని చెప్పారు.