- 7వ రోజుకు పారిశుధ్య కార్మికులు సమ్మె
ప్రజాశక్తి-మండపేట : మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తల రాతలు మారడంలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.