కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజల కోరిక

May 6,2024 23:11
కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజల కోరిక

ప్రజాశక్తి-ముమ్మిడివరం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు, విద్యావంతులు కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ అమలాపురం పార్లమెంట్‌ అభ్యర్థి జంగా గౌతమ్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో పార్టీ జిల్లా ఎస్‌సి సెల్‌ చైర్మన్‌ వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో, చదువుకున్న వారిలో ఆదరణ పెరిగిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోడీ, జగన్‌ ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలక పక్షాలు భయపడి అన్ని సామాజిక వర్గాల వారితో ప్రత్యేక సమావేశాలు పెట్టి రూ.కోట్లు వెచ్చించి ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. నవరత్నాలకు ఓట్లు రావని తెలిసి సిఎం వైఎస్‌.జగన్‌ ఓట్లను గ్రామాల్లో పల్లెల్లో 2000 వేలకు ఓట్లు కొంటున్నారని, ప్రభుత్వం నియమించిన గృహ సారథుల ద్వారా 50,000 నుండి లక్ష రూపాయలు వెచ్చించి ఓట్లు కొంటున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ రావాలని, ప్రధానిగా రాహుల్‌ గాంధీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి చేసే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రజలు ఇష్టపడుతున్నారన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం ముమ్మిడివరం ఎయిమ్స్‌ కళాశాల నుంచి కాట్రేనికొన వరకూ రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.సూరిబాబు, యార్లగడ్డ రవీంద్ర, దేవరపల్లి రాజేంద్రబాబు, పచ్చమట్ల ఉదయ భాస్కర వర్మ, గోడి భాస్కరరావు, కాశి అచ్యుతరామయ్య, అయితాబత్తుల పండుబాబు, చంటిబాబు, మెండి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️