- పోటీలను ప్రారంభించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల,కలెక్టర్ నాగలక్ష్మి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో క్రీడా పోటీలను డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ నాగలక్ష్మి, జెసి మయూర్ అశోక్తో కలిసి ప్రారంభించారు. ఐదు క్రీడా అంశాల్లో కబడ్డీ, క్రికెట్, ఖో ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో పండగ వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా ఎంతో ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించి వారికి ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు,క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. సుమారుగా 100 కోట్లు పైన డబ్బులు వెచ్చించి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించేందుకు సచివాలయం స్థాయిలో పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.బాగా ఆడి రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలపాలని కోరారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా క్రీడలు నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్రీడలకు ప్రభుత్వం కల్పిస్తున్న మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,40,000 పైగా రిజిస్ట్రేషన్ల జరిగాయన్నారు.ఇంకా ఎవరైనా ఆడాలనుకుంటే రిజిస్ట్రీషన్ చేసుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాజ్కుమార్, నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీరాములు నాయుడు, డిప్యూటి మేయర్ శ్రావణి,సెట్ విజ్ సీఈఓ రామ్గోపాల్,డి ఎస్ డి ఓ అచ్యుత్ కుమార్,జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, ఐదు క్రీడా అంశాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అంతకు ముందు పులివేషాలు,వాయిద్యాలు మద్య సంబరంగా స్వాగత ఏర్పాటు చేశారు.అనంతరం బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు.