సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నాం

Apr 28,2024 21:27
  • ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల ఇంచార్జ్‌ లక్ష్మీ మాంధాత

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో స్వచ్ఛమైన విద్యను అందిస్తున్నామని, కోర్సుల్లో చేరాలనుకునేవారు మధ్యవర్తులెవరికీ ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని అర్హత ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తామని ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల ఇంఛార్జ్‌ లక్ష్మీ మాంధాత తెలిపారు. ఆదివారం లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లక్ష్మీ మాంధాత మాట్లాడుతూ, శ్రీ కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలలు నుంచి డొనేషన్లు తీసుకుంటున్నారనే దుష్ప్రచారాన్ని ఖండించారు. తాము ఎలాంటి డొనేషన్లు తీసుకోవడం లేదని, స్వచ్ఛమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పాఠశాలలు నడుస్తున్నాయని, తిరుపతి, హైదరాబాద్‌, విజయవాడ, మహబూబ్‌ నగర్‌, జంబుకేశరం (తిరువన్నికోయిల్‌), నాసిక్‌ పూణేలో సంప్రదాయ బాలికల పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. 2024లో కొత్త పాఠశాలలు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6, 7 తరగతులకు అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుపతి సంప్రదాయ పాఠశాలలో 350 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో పైన పేర్కొన్న అన్ని పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 1000కి పైగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా, పొదిలి మండలం, ఓబులక్కపల్లి గ్రామంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య, శిక్షణను అందించడంపై దృష్టి సారించామని, ఆడపిల్లల కోసం తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ మాంధాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్లను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో విజయవాడ శాఖ ఇంచార్జి విష్ణుభట్ల పద్మావతి, వాలంంటీర్‌ శ్రీరామ్‌ పాల్గొన్నారు.

➡️