నేడు తాడేపల్లికి సీతారాం ఏచూరి రాక

May 8,2024 00:53

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్‌ స్థానం సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ తాడేపల్లిలో బుధవారం బహిరంగ సభ జరగనుంది. సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నారు. ఈ మేరకు వివరాలను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు తాడేపల్లి అమరారెడ్డిభవన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం నెహ్రూ బొమ్మ సెంటర్‌లో ఐదు గంటలకు జరిగే బహిరంగ సభకు తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల నుంచి సిపిఎం శ్రేణులతో పాటు పేదలు పెద్దఎత్తున తరలివస్తారని చెప్పారు. సభకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నెహ్రు బొమ్మ సెంటర్‌లో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. మరోవైపు సభ జయప్రదం కోసం ఎమ్మెల రామయ్య కాలనీ, ప్రకాష్‌నగర్‌, బోసుబొమ్మ సెంటర్‌, ముగ్గురోడ్డు, యాదవపాలెం, పుష్కరకాలనీ, అంజిరెడ్డికాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంతోపాటు సమావేశాలు నిర్వహించారు. నాయకులు పి.దుర్గారావు, ప్రభాకర్‌, ఇక్బాల్‌, రాజ్యం, శారద, తులసమ్మ, ఎం.సూర్యారావు, డి.శ్రీనివాసకుమారి, జి.సుబ్బారెడ్డి, డి.విజయలక్ష్మి, సిహెచ్‌.వెంకటరత్నం, డి.విజరు, కె.బాబూరావు, వై.శ్రీనివాసరావు, ఫిరోజ్‌, ఎస్‌.ముత్యాలరావు, అంజిరెడ్డి, కె.మేరి పాల్గొన్నారు.
పార్కింగ్‌ స్థలాలు : బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఈ కింద సూచించిన ప్రదేశాల్లో తమ వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలని సభ నిర్వాహకులు తెలిపారు. కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, ఇప్పటం, వడ్డేశ్వరం, కొలనుకొండ నుంచి వచ్చే వాహనాలు కొత్తూరు రైల్వేగేట్‌ సమీపంలో రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డులో వాహనాలను నిలుపుకోవాలి. ఉండవల్లి, పెనుమాక, కెఎల్‌రావు కాలనీ, సీతానగరం, సుందరయ్యనగర్‌ నుంచి వచ్చే వాహనాలు గణేష్‌ కళామందిరం వద్ద, మంగళగిరి వైపు నుంచి వచ్చే వాహనాలు మున్సిపల్‌ కార్యాలయం పక్కన రవీంద్రభారతి స్కూల్‌ సమీపంలో పార్కింగ్‌ చేసుకుని సభా స్థలికి చేరుకోవాలని నిర్వాహకులు కోరారు.

➡️