ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కోలాటం మాస్టర్ మంత్రూ నాయక్ను ఆదివారం తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని రంగారాయుడు చెరువు సమీపంలో గల అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు. నంది అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం, రూ.పది వేలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రామావత్ మంత్రూనాయక్ మాట్లాడుతూ తనది పుల్లలచెరువు మండలంలోని నరజాముల తండా అని తెలిపారు. 12 ఏళ్ల క్రితం సరదా కోసం తెలంగాణలో శివాజీ గురువు దగ్గర కోలాటం నేర్చుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 300 టీములకు కోలాటం నేర్పినట్లు చెప్పారు. అందులో ఎక్కువగా మహిళా టీములకే నేర్పినట్లు తెలిపారు. గత నెల 30వ తేదీన ఒంగోలులో రాష్ట్రస్థాయిలో కోలాటం పోటీలను తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆ పోటీలలో అత్యంత ప్రావీణ్యం కనబరిచినందుకు గాను తనను సన్మానించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అప్పినపెళ్లి భాస్కరాచారి, జాతీయ సమన్వయకర్త ప్రదీప్కుమార్, చైర్మన్ రాజ్ కుమార్, జాతీయ అధ్యక్షులు రంగశెట్టి రమేష్, జాతీయ కన్వీనర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/3YPL19.jpg)