పచ్చని చెట్లతో పల్లెల్ని నింపుదాం

పచ్చని చెట్లతో పల్లెల్ని నింపుదాం

నిడిగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న రామ్మోహన్‌ నాయుడు

      బత్తలపల్లి : ఫ్యాక్షన్‌, గ్రామ కక్షలను రూపుమాపి పల్లెల్ని పచ్చటి చెట్లతో నింపుదామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు. తాడిమర్రి మండలం నిడిగిల్లు గ్రామంలో ధర్మవరం టిడిపి నియోజవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పరిటాల రవీంద్ర ట్రస్ట్‌ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ మొక్కలను నరకడం చాలా సులవుని, అయితే వాటిని పెంచడం చాలా కష్టం అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని పరిటాల మెమొరియల్‌ ట్రస్ట్‌ ద్వారా గ్రామాల్లో చేపట్టడం అభినందనీయం అన్నారు. గ్రామాల్లో ఫ్యాక్షన్‌, కక్షలను నిర్మూలించేందుకు యువ నాయుడు పరిటాల శ్రీరామ్‌ చెట్లను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజాభివృద్ధి కోరుతూ రాజకీయాల్లో వచ్చిన పరిటాల శ్రీరామ్‌ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ పల్లె ప్రశాంత వాతావరణంలో ఉండాలన్న ఉద్ధేశంతో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. చెట్లు నరికే సంస్కృతి పోయి చెట్లను పెంచే సంస్కృతి రావాలని ఆకాంక్షించారు. పరిటాల మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. గ్రామాల నుంచి ఫ్యాక్షన్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్ధేశంతో తాము ఈకార్యక్రమం చేపట్టామన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మెక్కలు నాటడం మంచి కార్యక్రమం అన్నారు. పరిటాల రవీంద్రతో రాజకీయంగా తాను కలిసి పని చేశానని, ఆయన మంచి నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కందికుంట వెంటప్రసాద్‌, టిడిపి మండల కన్వీనర్‌ కూచి రాము, సర్పంచి నాగభూషణం, గంగలకుంట రమణ, మదనపు పోతులయ్య, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బత్తలపల్లిలో ఘనస్వాగతంనిడిగల్లు గ్రామంలో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు బత్తలపల్లిలో టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ధర్మవరం టిడిపి ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి వెళ్తున్న సమయంలో బత్తలపల్లి మండలం ఎర్రాయపల్లి గ్రామం వద్ద టిడిపి రైతుసంఘం నాయకులు చల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడును గజమాలతో సత్కరించారు. ఎర్రాయిపల్లి గ్రామం నుంచి బత్తలపల్లి వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి సతీష్‌, ముల్లగూరు జగ్గు, అప్పుస్వామి, జొన్నలగడ్డ రంగనాయుడు, సంగాల సూరి, తరిగోపుల చౌదరి, బొమ్మినేని శ్రీరాములు, వెంకటగారిపల్లి బాబు, సుధాకర్‌, వెంకట చౌదరి పాల్గొన్నారు.

➡️