వైసిపి నాయకులకు చుక్కెదురు

May 8,2024 22:26

నాయకులను ప్రశ్నిస్తున్న బ్రాహ్మణపల్లి తండా యువకులు

                  పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో వైసిపి కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని గ్రామంలోని యువకులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామాన్ని ఏమి అభివద్ధి చేశారని ఎన్నికల ప్రచారానికి వచ్చారని యువకులు నాయకులను నిలదీశారు. ఐదేళ్ల క్రితం ఒక్కసారి గడపగడపకు అంటూ స్థానిక శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, ఆయనతో పాటు మున్సిపాలిటీ చైర్మన్‌, కౌన్సిలర్లు ఒక్కసారి వచ్చారన్నారు. ఆ తర్వాత ఇంతవరకు తమ గ్రామంలోకి వచ్చి సమస్యలను అడిగిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసిపి నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. అవార్డు కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి, సాయినాథ్‌ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ప్రచారం చేసుకునే హక్కు ఏ పార్టీకైనా ఉందని అన్నారు. ఆగ్రహించిన గ్రామస్తులు యువకులు ఎమ్మెల్యే గెలిచినప్పటినుంచి తమ గ్రామాన్నిఒక్కసారి కూడా సందర్శించలేదని ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. దీంతో నాయకులు ‘మీ ఓట్లు మాకు అవసరం లేద’ని అక్కడ నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు.

➡️