బాధ్యతలను స్వీకరిస్తున్న రజని
ప్రజాశక్తి – ఎచ్చెర్ల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఐదో వైస్ ఛాన్సలర్గా కె.రజని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆమె మూడేళ్ల పాటు విసిగా కొనసాగనున్నారు. 1994లో ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులై అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఎయులో పలు హోదాల్లో పనిచేసి 2019 నవంబరులో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్లో ఫెలోగా, విజయనగరం జెఎన్టియు పాలకమండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. బిఆర్ఎయు తొలి మహిళా విసిగా బాధ్యతలు స్వీకరించిన రజనికి వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, టి.కామరాజు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.రాజశేఖరరావు, సిడిసి డీన్ పి.సుజాత, ఆయా విభాగాల సమన్వయకర్తలు, అధ్యాపకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరిట ఏర్పడిన ఈ వర్సిటీని ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో ఉన్నత విద్యారంగంలో బిఆర్ఎయుకు మరింత గుర్తింపు తీసుకొస్తానని తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందు వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.