మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహనరావు
- సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహనరావు
ప్రజాశక్తి – పలాస
విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన, రహస్య చెలిమి చేస్తున్న వైసిపిలను ఓడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్బాబుకు మద్దతుగా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సభలో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం చట్టపరంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని, విశాఖపట్నం రైల్వేజోన్ ఊసే లేదని విమర్శించారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి కాలేదన్నారు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు వంశధార సాగునీరు అందకపోవడంతో ఏటా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్బాబు మాట్లాడుతూ పలాస ప్రాంతంలో కబ్జాలు పెరిగిపోయాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. కబ్జాలపై తాను శ్వేతపత్రం విడుదల చేస్తానని, మిగతా అభ్యర్థులు కూడా శ్వేతపత్రం విడుదల చేసే సత్తా ఉందా సవాల్ విసిరారు. జీడిపిక్కలకు మద్దతు ధర కావాలని రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసిపి, టిడిపిలకు ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని, ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జీవితేశ్వరరావు, సిపిఎం, సిపిఐ నాయకులు ఎన్.గణపతి, చాపర వేణుగోపాల్ పాల్గొన్నారు.