ప్రజాశక్తి-కొండపి : రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుదాకర్రెడ్డి తెలిపారు. కొండపిలో శనివారం బారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండపి నుంచి చోడవరం వరకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెరిదేపి గ్రామంలో సిపిఎం నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కొండపిలోని ఆర్టిసి బస్టాండ్ కూడలి ఈదా సుధాకర్రెడ్డి మాట్లాడారు. దేశాన్ని అన్ని విధాల ఆధోగతి పాలు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తెస్తామని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అవినీతిని అరికడతామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పిన మాటలన్నీ నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూలిపోయిందన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు కాకపోగా రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైసిసి, ప్రతిపక్ష పార్టీలు అయిన టిడిపి, జనసేన పార్టీలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బిజెపికి భజన చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్పార్టీ కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పసుమర్తి సుధాకర్రావు మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో తాగునీటి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. సంగేమేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని వేల ఎకరాలు భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసే వారు కనపడడం లేదన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతిధి మన్నం ప్రసన్నరాజు, కొండపి కోఆర్డినేషన్ నాయకుడు బొడ్డు సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చుండూరి నరసింహరావు, సిపిఐ నియోజకవర్గ నాయకుడు వీరారెడ్డి, సిపిఎం నాయకులు కెజి.మస్తాన్, సిపిఎం టంగుటూరు మండల నాయకుడు మోజెస్, సిపిఐ మండల నాయకులు లక్ష్మి, కొమ్ము రమేష్ , సిపిఎం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శింగరాయకొండ : కొండపి నియోజక పరిధిలోని టంగుటూరు జరుగుమల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం శనివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్పార్టీ కొండపి నియోజక వర్గ అభ్యర్థి పసుమర్తి సుధాకర్ రావు ఈ రోడ్షోలో పాల్గొన్నారు. టంగుటూరు నుంచి జరుగుమల్లి కామేపల్లి మీదుగా కొండేపి, కొండపి నుంచి టంగుటూరు వరకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రంలో అభివద్ధి జరిగిందన్నారు. టిడిపి, వైసిపి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేసుపోగు మోజెస్, సిపిఐ నాయకుడు కె.వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయబ్రసూల్ తదితరులు పాల్గొన్నారు.