శ్రీవారి లడ్డు నాణ్యత పెంచడానికి చర్యలుప్రజాశక్తి -తిరుపతి సిటీ శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డెయిరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై, అందుకు తీసుకోవలసిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు. తరువాత ప్రముఖ డెయిరీ నిపుణులు విజయభాస్కర్ రెడ్డి, సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. ఈ సమావేశంలో జెఈఓ గౌతమి, ఎస్వి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, కొనుగోలు జిఎం మురళీకష్ణ, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.