బొబ్బిలిలో వైసీపీ ప్రచారం

Apr 10,2024 11:30 #Vizianagaram

ప్రజాశక్తి-బొబ్బిలి : మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మున్సిపాలిటిలోని గొల్లపల్లిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్దించారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేసి వైసీపీను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ, గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన వస్తుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, వైసీపీ నాయకులు మామిడి శ్రీకాంత్, తూముల భాస్కరరావు, శంబంగి వేణుగోపాలనాయుడు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంపీ సమక్షంలో పంచాయతీ

మున్సిపల్ ఎన్నికల అనంతరం వైసీపీ కార్యక్రమాలకు వైసీపీ పట్టణ మాజీ అద్యక్షులు సావు కృష్ణమూర్తి, 12వ వార్డు కౌన్సిలర్ సావు శారద దూరంగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఆశించినప్పటికి సావు మురళికు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి వైసీపీలో ఉంటూ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారానికి గొల్లపల్లి వెళ్లిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో సావు కృష్ణమూర్తి ఇంటి వద్ద పంచాయతీ జరిగింది. తన కోడలు శారదకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ చంద్రశేఖర్ ఆదేశిస్తే వారు చెపితే నేను ఇవ్వాలా అని మీరు అనలేదా అని ఎమ్మెల్యే శంబంగిను ఎంపీ బెల్లాన ముందు సావు కృష్ణమూర్తి ప్రశ్నించారు. మంత్రి, ఎంపీ ఆదేశాలను బేఖాతరు చేసి ఇప్పుడు ఎలా తాను ఎమ్మెల్యేకు మద్దతుగా పని చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతగొడవలను పక్కన పెట్టి వైసీపీ గెలుపుకు పని చేయాలని, మీకు న్యాయం చేస్తామని ఎంపీ బెల్లాన హామీ ఇవ్వడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

➡️