రామ రాజ్యమా… లౌకిక రాజ్యమా?

article on rama rajyam or secular state communal politics bjp ram mandir

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని చాప కింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని చేసిన ఉపన్యాసమే అందుకు నిదర్శనం. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది సాధువులు, సన్యాసులు, బడా వ్యాపారవేత్తలు, కోట్లాధిపతులు. ఎన్నికల ముందు రామ మందిరాన్ని ప్రారంభించి ప్రజల భావోద్వేగాలను తమ వైపు మరల్చుకోవాలన్నది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రధాన ఎత్తుగడ. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని మోడీ కలిసి రామమందిరాన్ని ప్రారంభించారు. దీన్నిబట్టి మనమేం అర్థం చేసుకోవాలి? మతం ముసుగులు తొలిగిపోయాయి. ఇక అంతా బహిరంగమే! ఎన్నికలయ్యేదాకా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి మత ఉద్రిక్తతలు చెలరేగుతాయో, ఘర్షణలు జరుగుతాయో తెలియని పరిస్థితి. మతాన్ని, రాజకీయాలను వేరుచేసి చూడటం లేదు. మతానికి రాజకీయాలను అనుసంధానం చేసి అధికారం కోసం తన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు మోడీ. గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని దానిని కేంద్రం అమలు చేస్తున్నది. 1990లో ఎల్‌కె అద్వానీ రామజన్మభూమి పేరుతో రథయాత్ర ప్రారంభించి 1984లో రెండు సీట్ల నుంచి 150 సీట్లకు తీసుకొచ్చారు. అప్పటినుంచే కాషాయపు జెండా తన ఎజెండాను పూర్తిగా మార్చుకున్నది. బిజెపిగా అవతరించింది. పేరు మార్చింది. ప్రజలను ఏమార్చింది. తన విధానాలను ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని రామజన్మభూమితో కొనసాగించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంకం పూర్తయింది. ఇక మధురలో కృష్ణ దేవాలయం, ఇతర దేవాలయాలపై దృష్టి సారించింది. నిరంతరం ప్రజలను మత ఉద్వేగాల వైపు మరల్చి ఓట్లు దండుకునే కార్యక్రమాన్నే బిజెపి పెట్టుకున్నది. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. పరమత సహనం పాటిస్తూ అందరినీ కలపుకుపోయేదే రాజనీతి. రాజకీయాలు లౌకికత్వానికి సంబంధించినవి. వర్తమానంలో రాజకీయాలలో మతం ప్రధాన పాత్ర వహించే విధంగా బిజెపి తన ఎత్తుగడలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు రామజన్మభూమి, రామాలయం వంటి అంశాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. రామాలయాలు దేశమంతటా ఉన్నాయి. రాముడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాడని చెప్తారు. అన్న మాట కోసం అధికారాన్ని వదిలి అడవులకు పోయాడంటారు. అయితే రామ నామం జపించే పాలకులు చేసిన వాగ్దానాలను ఉట్టి మీదకు ఎక్కించారు. నిత్యావసర ధరలను ఆకాశమార్గం పట్టించారు. సగటు పేద ప్రజలు ఆ ధరలను అందుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది మోడీ రాజ్యంలో ప్రజల పరిస్థితి.

పదేళ్ల కిందట అధికారంలోకి రాక ముందు మోడీ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారు. రైల్వేస్టేషన్‌లో చారు అమ్మినవాడిగా, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ప్రచారార్భాటం ప్రారంభిస్తే ప్రజలు నమ్మారు. బిజెపి ని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మోడీ చేసిన వాగ్దానాలేమిటి? నేడు చేస్తున్నదేమిటి? పేద ప్రజల, కార్మికవర్గ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. రైతాంగం పట్ల దోపిడీ విధానాన్ని అనుసరించే చట్టాలను సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. కార్మిక వర్గాలను పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే చేదు మందు లాంటి సంస్కరణలకు చక్కెరపూత పూశారు. యాజమాన్యాలకు కార్మిక వర్గం బానిసలుగా పనిచేసేలా తిరోగమన సంస్కరణలను ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారుల లాభాలకు, వారి సంతోషం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని మోడీ ఎప్పటికప్పుడు తన విధానాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. కోట్లాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మూలుగుతున్నా పేద ప్రజలకు పంచడానికి చేతులు రావడం లేదు కానీ అదానీ, అంబానీ లాంటి వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని వేగంగా పెంచి పోషిస్తున్నది ఎవరు, మోడీ కాదా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఊసెక్కడీ ఉన్న ఉద్యోగాలను ఊడ పీకడమే కాకుండా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని సెలవిచ్చిన మోడీ ఈ దేశానికి ‘మహా నాయకుడు’, ‘విశ్వగురు’!

ప్రభుత్వ రంగ పరిశ్రమలను టోకుగా అమ్మడం, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం లాంటి చర్యలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు బిజెపి పాలకులు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది, బడా పెట్టుబడిదారులకు కట్టబెడితే ఎంత సంపద వచ్చింది గొప్పగా చెపుకుంటున్నారు. కానీ దేశాన్ని దోచుకుని సరిహద్దులు దాటించిన బడా పారిశ్రామిక వేత్తలను గురించి ఒక్క రోజు కూడా మాట్లాడరు! కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పట్టపగలే బ్యాంకు రుణాల ద్వారా దోచుకున్న విజరు మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వాళ్ళ గురించి అసలు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. నేడు ప్రపంచంలో మూడవ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ ఎదిగాడు! ఇది ఎవరి చలువో అందరికీ తెలిసిందే. కేవలం మోడీ ఈ పదేళ్ల పాలనలో అదానీలు, అంబానీలు, టాటా బిర్లాలు కోట్లాది ఆస్తులను సంపాదిస్తూ వేగంగా ప్రపంచ కుబేరులను దాటిపోతున్నారు. దగా పడ్డ ప్రజల ఆదాయం, ప్రజల జీవన స్థితులు మాత్రం మారడం లేదు. కారణం, ప్రజల్ని మతం చుట్టూ భ్రమింపజేయడం ద్వారా అంతర్గత వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. నూటికి ఎనభై శాతం వ్యవసాయ దేశంలో రైతుల బతుకులు చితికిపోతున్నా వారి గురించి పట్టించుకోరు. ప్రజల సంపద బడా కోట్లాధిపతుల చేతుల్లోకి  వెళ్లిపోతున్నా మాట్లాడే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్య మైతున్నాయి, క్షీణిస్తున్నాయి. సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి పాలన లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగమైన దేశానికి ప్రయోజన కరమైన బడా ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మి వేయడం లేదా అంగడి దుకాణాలు ఇచ్చినట్లు కిరాయిలకు ఇస్తున్నది. ఇది దేశానికి నష్టదాయకమే కాదు, భవిష్యత్తుకు శాపం!

ప్రభుత్వ పరిశ్రమలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మాత్రం ఒకటికి పదింతలు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు, డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకుంటున్నారు. మన పాలకులు ఆనందపడుతున్నారు. ఇదే అసలైన అభివృద్ధిగా చెబుతున్నారు. మరి అదానీ అసలు స్వరూపాన్ని హిండెన్‌బర్గ్‌ బయటపెడితే దీనిపై స్పందించరేం? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల సొమ్మును కొంతమంది పెట్టుబడిదారులు దోచుకోవడం, దాచుకోవడం పరిపాటిగా పెట్టుకున్నారు. అందుకు మోడీ అండదండలే కారణమన్నది దేశ పౌరులకు తెలియంది కాదు. ఓవైపు పన్ను ఎగవేతలు, మరోవైపు భారీ కుంభకోణాలు విజృంభిస్తుంటే వాటి నియంత్రణలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్ల అప్పు ఉన్న మన దేశం నేడు రూ.కోటి 55 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది మోడీ పాలనలో జరిగిన అప్పుల అభివృద్ధి. అప్పులు తీర్చడానికే కేంద్ర బడ్జెట్‌లో అధిక శాతం వడ్డీలకు కట్టాల్సి వస్తుంది. దేశ ప్రజలపై ఎక్కడలేని భారాలను మోపుతున్నది. దేశ ఆదాయ వనరుగా ఈ దేశంలోని కోట్లాది పేద ప్రజలను సరుకుగా మార్చుకుంటున్నది. దుడ్డుకర్ర లాంటి వివిధ పథకాలు తెచ్చి మధ్య తరగతి, పేద వర్గాల నడ్డి విరగ్గొడుతున్నది. అధికారం చేతిలో ఉందని తనకు తోచిన విధంగా వెనక ముందు చూడకుండా తిరోగమన విధానాలు అమలు చేస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దేశాన్ని కుదేలు చేసింది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టలేక పోవడంతో కోట్లాదిమంది అసంఘటిత కార్మికుల ఉసురు తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల, పేద ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఈ దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీసకొస్తామని జబ్బలు చరిచింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పింది. ఒక్క రూపాయి నల్లధనం కూడా బయట పెట్టలేకపోయింది. దీనికితోడు ధరల్ని అదుపు చేయడంలో, నిరుద్యోగాన్ని రూపు మాపటంలో, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు.

ఇది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ (రామ) రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజా సంక్షేమం లేకపోగా పేదల బాధలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. చదువు, వైద్యం కార్పొరేట్ల పరమైంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు సిపిఐ (ఎం) లాంటి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రతిఘటి స్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి-ఆరెస్సెస్‌ వేస్తున్న పాచికే రామరాజ్యం. ఇదే పదేళ్లలో మోడీ దేశానికి చేసిన నిర్వాకం. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన సందర్భంగా మోడీ వేస్తున్న అడుగులను ఈ దేశంలోని యువకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు గమనించాలి. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన భారత లౌకికత్వాన్ని ఓటు ద్వారా బలపరచాలి. అంధ విశ్వాసాల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.

  • వ్యాసకర్త సెల్‌ : జూలకంటి రంగారెడ్డి, 9490098349
➡️