మొత్తం మోడీ మహత్య కీర్తనలేనా?

modi communal politics nitish kumar join in nda telakapalli ravi article

జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది నిజమే కానీ ఆ రోజుతో చరిత్ర ఆగిపోదు అని సీనియర్‌ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తా వ్యాఖ్యానించారు. నిజం. రాజకీయాలలో ఒక పరిణామం తీవ్రతను గుర్తించడం వేరు, అంతటితో అయిపోయిందనీ అదే అన్నిటినీ నిర్ణయిస్తుందని అనుకోవడం పొరబాటు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు బడా మీడియా రోజుకు రోజు అలాంటి కబుర్లే కుమ్మరిస్తుంటుంది. కొత్త కొత్త పదజాలాలతో పక్కదోవ పట్టిస్తుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ మీడియా ఏ విధంగా అన్ని విషయాలూ సామ్రాజ్యవాద కోణంలో ఇస్తుందో…దేశంలో బడా మీడియా కూడా ప్రతిదీ మోడీ మహత్తర విజయంగా అభివర్ణిస్తుంటుంది (అదే రాష్ట్రాలలో అయితే వారి వారి ఎంపికల ప్రకారం చేస్తుంటుంది గానీ ఆ ముచ్చట మరోసారి). మూడు రాష్ట్రాలలో బిజెపికి మెజార్టీ రావడంతో హ్యాట్రిక్‌ ఖాయమని తేల్చేసింది. ఇందాక చెప్పుకున్న రామమందిరం ప్రాణప్రతిష్టతో తిరుగులేదని చెప్పింది. ఆ పిమ్మట బీహార్‌లో నితీష్‌ కుమార్‌ సరికొత్త ఊసరవెల్లి వేషాలతో ‘ఇండియా’ వేదిక పని అయిపోయిందని నిర్ణయించింది. అదే సమయంలో బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేది లేదని చెప్పడంతో మీడియా మరింత రెచ్చిపోయింది. ఇందులో ప్రతి అంశాన్ని ఒక్క వైపు నుంచే చూపిస్తూ అంతా మోడీకి అనుకూల దిశలోనే జరిగిపోతున్నట్టు చిత్రించడానికి నానా పాట్లు పడుతున్నది. అందుకు తగినట్టే స్వతంత్ర ఆర్ణబ్‌ లు లోకల్‌ ఆర్ణబ్‌ ల వంటి స్టార్‌ వ్యాఖ్యాతలు మోడీ అద్భుత జనరంజక శక్తికి కీర్తనల జోరు పెంచుతున్నారు. ఈ ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకూ ఆగేది కాదు. తర్వాతి ఘట్టం ప్రజల తీర్పుపై ఆధారపడి వుంటుంది.

నితీష్‌ ప్రహసనం నిజాలేమిటి?

బిజెపి ఎన్నికల విజయాలు, కొంతమంది నేతల ఫిరాయింపులు నిజమే. కానీ నాణేనికి మరోవైపు చూడవలసిన పనిలేదా? ఉదాహరణకు బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ఫిరాయింపు కొత్తేమీ కాదు, అనుకోనిదీ కాదు. ఆయన పేరులో మొదటి అక్షరానికి దీర్ఘం లేదని అందరికీ తెలుసు. కాని 2019 ఎన్నికల నాటికి ఆయన బిజెపితో కలిసే పోటీ చేశారు. అత్యధిక లోక్‌సభ సీట్లు వాళ్లకే వచ్చాయి. కనుక రాజకీయంగా ‘ఇండియా’కు దెబ్బ అనడం సరైందే గానీ ఇప్పుడు కొత్తగా కలిగే నష్టం లేదు. ఆయన అలా చేస్తాడనేది అందరి దృష్టిలో వున్నదే. అసలు ‘ఇండియా’ పేరిట హడావుడి చేస్తున్న సమయంలో కూడా ఎవరూ పెద్దగా విశ్వసించింది లేదు. కాకపోతే దేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకటైన బీహార్‌కు ఉత్తర భారతంలో ప్రభావశీల ప్రదేశంగా ప్రత్యేక స్థానముంది గనక లౌకిక పార్టీలు ఆయన రాకను ప్రోత్సహించాయి. నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల నాటికే నితీష్‌ బలం గణనీయంగా క్షీణించింది. ఆ ఎన్నికల్లో ఆర్‌జెడి కి 79, బిజెపికి 78 రాగా జెడియు కేవలం 45 మాత్రమే తెచ్చుకున్నది. 19 స్థానాలతో కాంగ్రెస్‌, 16 స్థానాలతో వామపక్షాలు ఇంకా బలంగా వున్నాయి. ఇప్పుడు నితీష్‌ కేవలం బిజెపి కీలుబొమ్మలానే బతకాల్సి వుంటుంది. ‘ఇండియా’ తరపున తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోరని తెలిసిన తర్వాతే ఆయన ప్లేటు ఫిరాయించాలని నిర్ణయించుకున్నాడు. మామూలుగా అయితే మీడియా దీన్ని చీల్చి చెండాడాలి. ఆ విధంగా ఊసరవెల్లి చందం అని రాయడం చెప్పడం జరిగింది గాని ప్రధాన దాడి ‘ఇండియా’ విచ్ఛిన్నంపైనే పెట్టారు. 2022లో తమను ఈసడించుకుని వెళ్లిన నేత తిరిగివస్తే బిజెపి ఎలా అక్కున చేర్చుకుని అధికారమిచ్చిందనేది మాత్రం ప్రశ్నించిన పాపాన పోలేదు.

మరోవైపు పరిణామాలు

నిజానికి ఇదే సమయంలో పక్కనున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌కు 11 స్థానాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌ మరిన్ని సీట్లు కోరుతున్న మాట నిజమే గాని ఈ మాత్రం సర్దుబాటు చిన్నదేం కాదు. ఆప్‌ నాయకుడు కేజ్రీవాల్‌ హర్యానాలో తాము వంటరిగా పోటీ చేస్తామంటూనే లోక్‌సభలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఇక రాజకీయంగా మరింత కీలకమైన పశ్చిమ బెంగాల్‌ విషయానికి వస్తే అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టిఎంసితో పొత్తు వద్దనే వైఖరి తీసుకుంది సిపిఎం. ఇటీవలి కాలంలో షహీద్‌ మినార్‌ మైదాన్‌లో యువత అపూర్వమైన బహిరంగ సభ కూడా జరిపింది. ‘ఇండియా’ లోని కాంగ్రెస్‌తో తప్ప సిపిఎంతో తమకు కుదరదని తృణమూల్‌ కూడా ప్రకటించింది. అయితే అంతా అయ్యాక మమత కాంగ్రెస్‌కు కేవలం రెండంటే రెండు లోక్‌సభ సీట్లే కేటాయిస్తానన్నది. మాల్దా దక్షిణం, బెర్హంపూర్‌ అనే ఆ రెండు ఇప్పటికీ కాంగ్రెస్‌ చేతుల్లోనే వున్నాయి. కనుక వారు కూడా అంగీకరించలేదు. ఈ సమయంలో రాహుల్‌ గాంధీ న్యాయ జోడో యాత్ర వచ్చినపుడు కూడా తృణమూల్‌ వర్గీయుల రాళ్లు విసిరి దౌర్జన్యం చేశారు. మరోవంక సిపిఎం నాయకులు సభలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాహుల్‌ గాంధీ మాత్రం తాము ఇప్పటికీ ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతున్నామన్నారు. కేరళలో ఎల్‌డిఎఫ్‌ యుడిఎఫ్‌ ఎప్పుడూ వేరు వేరుగానే పోటీ పడుతున్నాయి. కనక ఇక్కడ రాజకీయంగా గానీ సీట్ల రీత్యా గానీ నష్టపోయింది లేదు. పైగా ఒక్క యు.పి మినహా ఇవేవీ బిజెపి పాలనలోని రాష్ట్రాలూ కాదు. అందువల్ల బీహార్‌ పరిణామాలతో ‘ఇండియా’ అతలాకుతలం అయిపోయినట్టు అంతా తిరగబడినట్టు చెప్పడం దురుద్దేశపూరితం. ఇప్పుడు వారు గెలిచిన మూడు రాష్ట్రాలలో కూడా బిజెపికి 39 స్థానాలుంటే కాంగ్రెస్‌కు కేవలం రెండే వున్నాయి. అందువల్ల కొత్తగా ఏమొచ్చినా లాభమే గాని నష్టపోయేది వుండదు. ఇవన్నీ వాస్తవికమైన ఆధార సహిత విషయాలయినప్పుడు మోడీ ఏదో అపారబలం పుంజుకున్నట్టు మిగిలిన పార్టీలన్నీ భయంతో వణికి పోతున్నట్టు మీడియా చెప్పడం ఎంత దారుణం?

నిజంగా ఏకపక్షమా?

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అనేక మల్లగుల్లాలు పడినా ప్రజలు మాత్రం బిజెపికి అవకాశం నిరాకరించి కాంగ్రెస్‌ను ఎన్నుకోలేదా? అలాగే రామమందిరం వ్యవహారం బిజెపికి బాగా మేలు చేయొచ్చు గాని మతరాజ్య భావన వచ్చిందనే భావన కూడా రావడంతో ఏదో ఒక మేరకు వ్యతిరేక ఓట్లు కూడా పెరగవా? అంతా అనుకూలంగా వుంటే నితీష్‌ను మళ్లీ ఎందుకు రానిచ్చేవారు? బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు సీట్లు నిరాకరించారు గనక వెంటనే బిజెపితో పాటు ఆమెనూ ఎక్కువ చేసి చూపుతున్నారు గానీ ఆమె ‘ఇండియా’ను బలపర్చినప్పటి మాటేంటి? ఆమె తనే ప్రధాని కావాలనే ఆశతో అడ్డంకులు సృష్టించినప్పుడు వాటిని పెద్దగా చూపించిందీ వీరే కదా? మమత, కెసిఆర్‌, కేజ్రీవాల్‌ ఎవరూ కలసిరారని, బిజెపి వ్యతిరేక కూటమి వట్టి మాట అని అన్నవారు ఏదో విధంగా ‘ఇండియా’ ఏర్పడిన తర్వాత నాలుక కరుచుకోక తప్పలేదు. సిపిఎం వరకూ ఇది కేవలం బిజెపి మతతత్వంపై, కేంద్ర నిరంకుశత్వంపై పోరాడే ఒక వేదిక తప్ప కూటమి కాదని చెబుతూనే వుంది. ఆ మాట కొస్తే ఒక నిర్మాణ రూపం వద్దని కూడా సూచించింది. మల్లికార్జున ఖర్గేను చైర్మన్‌గా ప్రకటించిన రోజునే నితీష్‌ నిష్క్రమణ ఖాయమై పోయింది. దాంతో ఆయనను నియమించకపోవడమే సరైందని అప్పుడే అర్థమైంది. అందుకే ‘ఇండియా’లో సభ్యత్వం గల పార్టీలేవీ నితీష్‌ కోసం విచారించింది లేదు! ఆయన గురించిన అంచనా అది. రేపటి ఎన్నికల్లో కూడా 45 అసెంబ్లీ స్థానాలు గల ఆయన వెళ్లిపోయినా ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాల బలంతో గట్టిగా సవాలు చేయడం తథ్యమే. పక్కనే వున్న జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత సోరెన్‌పై ఇ.డి దాడులతో అరెస్టు చేయడం ప్రతిపక్షాలను బెదిరించే కుట్రలలో భాగమే. బీహార్‌లో లాలూ కుటుంబాన్ని, కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌నూ, ఢిల్లీలో కేజ్రీవాల్‌నూ ఇంకా ఎందరినో ఈ విధంగానే వేటాడటంలో ఆంతర్యం అదే. వారిలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారా లేదా అనేది ఇక్కడ కీలకం కాదు, బిజెపిని గట్టిగా వ్యతిరేకించే రాజకీయ శక్తులను వేధించి అడ్డు లేకుండా చేసుకోవాలి. ఈ కేసులన్నిటినీ చాలా వివరంగా చిత్రించే బడా మీడియా బిజెపికి సంబంధించినవారిపై వచ్చిన ఆరోపణలను మాత్రం నామమాత్రంగా చెబుతుంది. ఎవరో ఎందుకు, అదానీ వార్తలే అమాంతం మారిపోయాయి. ఆయనపై అంతర్జాతీయంగా అనుమానాస్పద కథనాలు వచ్చినా విచారించింది లేకపోగా ఆదుకోవడానికే మోడీ ఆరాటపడ్డారు. ఆ క్రమంలో ఆయన లాభాలు గతం కంటే మరింత పెరిగాయనేది ఇప్పుడు మీడియాకు ఇష్టమైన స్టోరీ! కనుక సమాచారం వడపోత, మోడీ మోత ఏ స్థాయిలోవుంది తెలియడానికి ఈ ఉదాహరణ చాలదా?

కథ ఇంకా చాలా వుంది!

తాజాగా ప్రవేశపెట్టిన అనామతు బడ్జెట్‌ ఆర్థికంగా దేశ దుస్థితిని కళ్లకు కడుతున్నది. దేశం అంతగా దూసుకుపోతుంటే ఎన్నికల కోసమైనా ఏవైనా తాయిలాలు, పథకాల మోత మోగించేవారు కదా? ఎలాగో ప్రహసనం ముగించి మళ్లీ గద్దెక్కాలన్న ఆరాటం తప్పితే ప్రజానుకూల పథకాలు ఒకటైనా ప్రకటించగలిగిందా? ఓట్ల కోసమైనా రాష్ట్రాలకు మేలు చేసిందా? ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటిని పట్టించుకోకపోగా వైసిపి, టిడిపి భుజాల పైకెక్కి తన పబ్బం గడుపుకునే తాపత్రయమే సాగుతున్నది. తెలంగాణలోనూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని బిఆర్‌ఎస్‌తో చెప్పిస్తూ మరోవైపు దాన్నీ బెదిరిస్తున్నది. తనతో వుందంటున్న జనసేనతోనూ దాగుడుమూతలాడుతున్నది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా స్థానిక అధికారం కోసమే పాకులాడుతూ కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకుండా కీచులాడుకుంటున్న దుస్థితి. తెలంగాణలో అధికార పార్టీగా, ఎ.పి లో వైఎస్‌ షర్మిల నాయకత్వంలో కదలిక పెరిగిన పార్టీగా కాంగ్రెస్‌ కూడా బిజెపిపై సైద్ధాంతిక రాజకీయ పోరాటానికి ఎన్నికల సమరానికి విశాల కలయిక అవసరం పూర్తిగా గుర్తించడంలేదు. ఎ.పి లో అన్నాచెల్లెళ్ల తగాదా ప్రధానమైతే తెలంగాణలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ యుద్ధం ముఖ్యమైపోయింది. మొన్న మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ అందరినీ కలుపుకుని వుంటే ఫలితాలు మారి వుండేవి. తెలంగాణలోనూ మెజార్టీ పెరిగి మరింత నిలకడ వచ్చేది. ఇలాంటి లోపాలు కాంగ్రెస్‌ వైపు, ఇతర ప్రాంతీయ పార్టీల వైపు వున్న మాట నిజమే గాని బిజెపికి తిరుగులేదనడం పాక్షిక సత్యం. బిజెపి యేతర బిజెపి వ్యతిరేక శక్తుల ఉమ్మడి బలం వారి కంటే ఎక్కువ. ఎన్‌డిఎ కూటమిలో చెప్పుకోదగిన పార్టీ కొత్తగా చేరిన జెడియు మాత్రమే. ఎన్నికల పోరాట ఫలితాన్ని ముందే చెప్పేసి చేతులెత్తేయమనడం దురుద్దేశ పూరితం. కథ ఇంకా వుంది. చేయవలసిందీ వుంది.

  • తెలకపల్లి రవి
➡️