నటి పూనమ్‌ వివాదాస్పద ప్రచారం – డిజిటల్‌ ఏజెన్సీ క్షమాపణలు

న్యూఢిల్లీ : సర్వైకల్‌ క్యాన్సర్‌ పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్‌ పెట్టించానంటూ నటి పూనమ్‌ పాండే చేసిన వివాదాస్పద ప్రచారం తీవ్ర విమర్శలకు దారితీసింది. సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్ల పూనమ్‌ మృతి చెందారంటూ ఆమె వ్యక్తిగత ఖాతాలో సిబ్బంది పోస్టు చేశారు. ఆ మరుసటి రోజే తాను చనిపోలేందంటూ నటి వీడియో షేర్‌ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ దుయ్యబట్టారు. ఈక్రమంలో … దీనిలో భాగమైన డిజిటల్‌ ఏజెన్సీ Schbang క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్‌ పాండే చేసిన ప్రచారంలో మేం భాగమయ్యాం. దీనిపై మేం క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నాం. అవగాహన కోసమే మేం అలా వ్యవహరించాం. 2022లో భారత్‌లో 1,23,907 సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు .. 77,348 మరణాలు నమోదయ్యాయి. పూనమ్‌ తల్లి కూడా క్యాన్సర్‌తో పోరాడి మఅతి చెందారని చాలామంది తెలియకపోవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దీనిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆమె చర్య వల్లే ఆన్‌లైన్‌లో దీని గురించి అత్యధికులు శోధించారు’ అంటూ ఏజెన్సీ తన ప్రకటనలో వివరణ ఇచ్చింది.

➡️