చిరంజీవికి పద్మ అవార్డు అందజేత

May 10,2024 08:31 #Megastar Chiranjeevi, #Padma award

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో 67 మందికి ఏప్రిల్‌ 22న పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా.. మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులతోపాటు అధికారులు హాజరయ్యారు.
ఇదిలా వుండగా.. ఈ ఏడాదిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి, సేవలందించిన వారిని పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలు అందించారు. అసాధారణమైన విశిష్ట సేవకు పద్మవిభూషణ్‌, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్‌, విశిష్ట సేవలకు పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు గ్రహీతల్లో 30 మంది మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఎన్‌ఆర్‌ఐ, పిఐఒ, ఒసిఐ వర్గం నుంచి 8 మంది ఉండగా.. 9 మందికి మరణానంతరం అవార్డులను ప్రదానం చేశారు.

➡️