- 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో మొత్తం 8.35 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. 94,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 49 లోక్సభ స్థానాల్లో 39 జనరల్, 3 ఎస్టి, 7 ఎస్సి స్థానాలున్నాయి. ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాల్లో 21 జనరల్, 8 ఎస్టి, 6 ఎస్సి స్థానాలున్నాయి. 10 రాష్ట్రాల్లో 1,717 అభ్యర్థులు లోక్సభకు పోటీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 8.95 కోట్ల మంది ఓటర్లుండగా, 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మహిళలు, 5,409 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 7.81 లక్షల మంది 85 ఏళ్లు పైబడిన వారు, 24,792 మంది వందేళ్ల పైబడిన వారున్నారు. 7.03 లక్షల మంది వికలాంగ ఓటర్లున్నారు. 94,732 పోలింగ్ కేంద్రాలు వుండగా, వాటిలో 9.47 లక్షల పోలింగ్ అధికారులు బాధ్యతలు నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 153 మంది పరిశీలకులున్నారు. 2 వేల మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 2,105 మంది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 881 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, 502 వీడియో వ్యూవింగ్ టీమ్స్ ఎన్నికల పనుల్లో ఉన్నాయి.