ఇడియే మోడీ ప్రధాన అస్త్రం

Mar 23,2024 10:04 #ED

– కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్షాలపై దాడులు
– రాజకీయంగా గుప్పెట్లో పెట్టుకునే యత్నాలు
– లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపి వ్యూహాలు
-కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరేన్‌ అరెస్టులు అందులో భాగమే
– ‘ఇండియా’ కూటమిని బలహీనపర్చే యత్నం
న్యూఢిల్లీ : భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి నేతృత్వ ఎన్‌డిఎ ప్రభుత్వం ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. 400కు పైగా లోక్‌సభ సీట్లను గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నది. సిద్ధాంత పార్టీగా గొప్పలు చెప్పుకునే ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నది. సొంత పార్టీ నాయకులనే చిన్న చూపు చూస్తున్నది.
ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి తన రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకుంటున్నది. సిబిఐ, ఇడి, ఐటి సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉసిగొల్పుతూ, వారిపై కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపేలా వ్యూహాలు పన్నుతున్నది. నాయకులను బెదిరించి పార్టీల్లో చీలికలు తేవటం, ప్రభుత్వాలు కూల్చటం, నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవటం వంటి చర్యలను కొనసాగిస్తున్నది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు ఇందులో భాగమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవితలు ఈ కేసులో అరెస్టైన విషయం విదితమే. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌, కవితల అరెస్టులతో ఢిల్లీ, తెలంగాణల్లోనే కాకుండా యావత్‌ దేశంలో రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చనీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇది ప్రచారాస్త్రంగా మలుచుకోవచ్చని బిజెపి భావించింది. అయితే, ఈ అంశం కాషాయపార్టీకి రివర్స్‌ఫైర్‌ అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రతిపక్షం బలంగా లేకపోవటంతో..
భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అత్యంత కీలకమైనది. గత రెండు దఫాల ఎన్డీయే పాలనలో ప్రధాన ప్రతిపక్షం బలంగా లేదు. ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన సీట్లను సైతం కాంగ్రెస్‌ గెలవలేకపోయింది. ఇక లోక్‌సభలో తమకు ఉన్న బలం చూసుకొని బిజెపి రెచ్చిపోయిందనీ, అనేక ప్రజా వ్యతిరేక, మత విద్వేష బిల్లులను తీసుకొచ్చి చట్టాలుగా మార్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
టార్గెట్‌ ‘ఇండియా’ కూటమి
రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓటమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. కాంగ్రెస్‌, ఆప్‌, డిఎంకె, సిపిఎం, సిపిఐ, జెడియు, జెఎంఎం, ఎన్‌సిపిలు అందులో కీలకంగా ఉన్నాయి. అయితే, బీహార్‌లో జెడియును దూరం చేసి.. నితీశ్‌కి మద్దతు పలికిన బిజెపి అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి బీజం వేసింది. ఇటు మహారాష్ట్రలోని కీలక ఎన్‌సిపి పార్టీలో కాషాయపార్టీ చీలిక తెచ్చింది. జార్ఖండ్‌ సిఎం, జెఎంఎం నాయకుడు హేమంత్‌ సొరెన్‌ను ఇదే ఇడి అరెస్ట్‌ చేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌పై కన్నేసిన బిజెపి.. ఇడి సహాయంతో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయించగలిగింది. అయితే, కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై దేశ ప్రజల నుంచి బిజెపి ఆశించిన స్పందన రాకపోగా.. బిజెపి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని తెప్పిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి దృష్టి మరల్చేందుకే..
బిజెపికి విరాళాలిచ్చిన 487 మందిలో మొదటి 10 మంది విరాళాలు దాదాపు రూ. 2,119 కోట్లుగా ఉన్నాయి. బాండ్‌ కొనుగోళ్లలో ఎక్కువ వాటా పెద్ద ప్రయివేట్‌ దాతల నుంచే ఉన్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల సమస్యను ఇప్పటివరకు సుప్రీంకోర్టు పరిష్కరించిన విధానం, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి బిజెపి ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో భాగంగా, అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామనే ఆలోచన కలిపించే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఇడిని మోడీ సర్కారు ఆయుధంగా వాడుతున్నదని వారు అంటున్నారు.
బిజెపి పాలనలో పెరిగిన ఇడి దాడులు
2005-2014 మధ్య, యూపీఏ హయాంలో ఇడి దాదాపు 112 సోదాలు నిర్వహించింది. 104 ఫిర్యాదులను కలిగి ఉన్నది. అయితే 2015-2022 మధ్య, బిజెపి ప్రభుత్వ హయాంలో ఇడి సోదాలు 3010 కాగా.. 888 వరకు ఫిర్యాదులు ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై 100కు పైగా సోదాలు జరిగాయి. బిజెపి, ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు, దాని మిత్రపక్షాలపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఇడి పట్టించుకోకపోవటం గమనార్హం. ఇడి ద్వారా మొత్తం కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులపై నమోదు చేయబడ్డాయని రాజకీయ విశ్లేషకులు కొన్ని గణాంకాలను ఉదహరిస్తున్నారు.
కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే కాదు.. అన్ని రకాల విమర్శకులపైనా కేంద్ర ఏజెన్సీ సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ను సుప్రీంకోర్టు విడుదల చేయటానికి ముందు మోడీ సర్కారు ఆయనను జైలుకు వెళ్లేలా చేసిందనీ, బిబిసి, భాస్కర్‌ మీడియా గ్రూప్‌లపై ఐటీ శాఖ దాడులు చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాగే, గతేడాది ఆక్స్‌ఫామ్‌ ఇండియా, ఇండిపెండెంట్‌ అండ్‌ పబ్లిక్‌-స్పిరిటెడ్‌ మీడియా ఫౌండేషన్‌, సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎన్‌జిఒలు, మరికొన్ని పరిశోధన థింక్‌ ట్యాంక్‌లకు విదేశీ నిధులు అందకుండా ఎఫ్‌సీఆర్‌ఏ, 2010 లైసెన్సులను మోడీ సర్కారు రద్దు చేసిందని విశ్లేషకులు, మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర : బృందాకరత్‌

  • యథేచ్ఛగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
  • సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని, ఆదాయ పన్ను విభాగం (ఐటి)ని దుర్వినియోగం చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించారు. ‘ కేజ్రీవాల్‌ అరెస్టును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసేందుకే బిజెపి ఈ చర్యకు దిగింది. ప్రతిపక్షాలను వేటాడేందుకు అధికార పార్టీ చాలా స్పష్టంగా ఇడిని అస్త్రంగా ఉపయోగిస్తోంది. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, వేధించడం ద్వారా ప్రతిపక్షాల ఫోరాన్ని బలహీనపరచాలని బిజెపి కుట్ర పన్నుతుంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ కుటుంబాన్ని కూడా ఇతరులు కలవనివ్వకుండా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. ఎన్నికల బాండ్లు బిజెపి తీసుకొచ్చిన అత్యంత అవినీతికర వ్యవస్థ అని బృందాకరత్‌ విమర్శించారు. ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ సకాలంలో విడుదల చేయకపోవడం వెనుక బిజెపి ఒత్తిళ్లున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. బాండ్ల పూర్తి వివరాల వెల్లడికి మూడు నెలల గడువు కోరడం పాలకపక్ష సిగ్గుమాలిన తనానికి నిదర్శనమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి బెదిరించడం లేదా కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి ద్వారా బిజెపి ఎన్నికల బాండ్లను తనకు నిధులు సమకూర్చే సాధనంగా మార్చుకొని క్విడ్‌ప్రోకు పాల్పడిందని తప్పుబట్టారు.

➡️