ఉన్నత విద్యలో మహిళలు అద్భుతమైన పురోగతిని సాధించినప్పటికీ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో వారు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళనకరం. 2016 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11న సైన్స్లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలలో మహిళలు, బాలికలు కీలక పాత్ర పోషించాలని వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ రోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్.టి.ఇ.ఎమ్) రంగాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలకు చాలా కీలకమైనవిగా పరిగణించ బడుతున్నాయి. అయినా ఇప్పటివరకు చాలా దేశాలు ఈ రంగాలలో లింగ సమానత్వాన్ని సాధించలేదు. మహిళలు సాధారణంగా మగవారితో పోల్చితే పరిశోధన గ్రాంట్లు పొందడంలో వెనుక ఉన్నారు. మొత్తం పరిశోధకులలో 33.3 శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, జాతీయ సైన్స్ అకాడమీలలో 12 శాతం మంది మాత్రమే మహిళలున్నారు. కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక రంగాలలో, ఐదుగురు నిపుణులలో ఒకరు మాత్రమే (22 శాతం) మహిళలున్నారు. మహిళలు ఇప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 28 శాతం, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ గ్రాడ్యుయేట్లలో 40 శాతం మాత్రమే ఉన్నారు. ఈ వివక్షత సమాజంలో అసమానతులకు దారి తీస్తుంది. సమాజాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుంది. కావున మహిళలు, బాలికలను విజ్ఞాన శాస్త్రంలో పాల్గొనడానికి ప్రోత్సహించడానికి కృషి చేయాలి. సంస్కృతి పేరుతో మహిళలు, బాలికలు వైజ్ఞానిక రంగానికి దూరంగా నెడుతున్నారు. సమాజంలో ఈ ధోరణి మారాలి. ప్రభుత్వ విధానాల్లోనూ వారికి పెద్ద పీట వేయాలి. అప్పుడే ఆశించిన పురోగతి సాధ్యం.
– సంపతి రమేష్ మహారాజ్,
సెల్ : 7989579428