తిరుపతి జిల్లాలో వారసుల హవా

  •  వైసిపి, టిడిపి ముమ్మర ప్రచారం
  •  తగ్గేదేలే అంటున్న ఇండియా బ్లాక్‌

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తాజా ఎన్నికలు తిరుపతి జిల్లాలో హోరెత్తిస్తున్నాయి. జిల్లాలో తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. పోలింగ్‌కు ఇక వారం రోజులే ఉండడంతో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. సంక్షేమానికే మళ్లీ అధికారం ఇస్తారని వైసిపి శ్రేణులు భావిస్తుండగా, సంక్షేమంలో పక్షపాతం, అభివృద్ధి లేమి, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు తమకు విజయావకాశాలుగా కలిసి వస్తాయని టిడిపి-జనసేన-బిజెపి కూటమి శ్రేణులు చెపుతున్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో పాటు వైసిపి, టిడిపి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఎలా దెబ్బకొట్టాయో ఇండియా బ్లాక్‌ అభ్యర్ధులు ఓటర్లకు వివరిస్తున్నారు.
తిరుపతి ఎంపి స్థానానికి సిట్టింగ్‌ వైసిపి ఎంపి మద్దిల గురుమూర్తి బరిలో ఉన్నారు. తాను మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు వైసిపి ఎంఎల్‌ఎ వరప్రసాద్‌కు టిక్కెట్‌ రాకపోవడంతో బిజెపిలో చేరి ఆ పార్టీ తరపున తిరుపతి ఎంపిగా బరిలో దిగారు. ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ పోటీలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలను అంటిపెట్టుకోవడం వల్ల తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని మోహన్‌ చెపుతున్నారు.
తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డి వైసిపి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆయన చెపుతున్నారు. చిత్తూరు వైసిపి ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులుకు ఆ పార్టీలో టిక్కెట్‌ రాకపోవడంతో జనసేన తరపున పోటీ చేస్తున్నారు. తొలుత కూటమిలో లుకలుకలు బహిరంగంగా కనిపించినా..ఆ తరువాత మూడు పార్టీల నేతలూ ప్రస్తుతం ప్రచారంలో భాగస్వాములవుతున్నారు కాంగ్రెస్‌ వేదిక నుంచి సిపిఐ అభ్యర్థి పి.మురళి పోటీ చేస్తున్నారు. చంద్రగిరిలో వైసిపి నుంచి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పోటీచేస్తున్నారు. తన తండ్రి భాస్కర్‌రెడ్డి గత పదేళ్లుగా చేసిన విస్తృతమైన ఆర్థిక, సామాజిక సేవలే తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. టిడిపి అభ్యర్థి పులివర్తి నాని కూటమిదే గెలుపన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి రెండోసారి డాక్టర్‌ వాసు పోటీ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి టిడిపి నుంచి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వైసిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బియ్యపు అనుచరులు చేసిన భూకబ్జాలు, అక్రమాలే తమను గెలిపిస్తాయని సుధీర్‌రెడ్డి చెపుతున్నారు. శ్రీకాళహస్తిలో తాను చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని నమ్మకంతో బియ్యపు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న పోతుగుంట రాజేష్‌నాయుడు టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వలస రావడంతో టిడిపి ఓట్లు చీలే అవకాశం ఉంది.
సత్యవేడులో ఎంఎల్‌ఎ ఆదిమూలంకు వైసిపి టిక్కెట్‌ రాకపోవడంతో సైకిల్‌ ఎక్కారు. మంత్రి పెద్దిరెడ్డి తనపై కక్షగట్టి వైసిపిలో టిక్కెట్‌ రాకుండా చేశారని ప్రచారం చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి తరపున పోటీలో ఉన్న నూకతోటి రాజేష్‌ ‘నాన్‌లోకల్‌’ అనే చర్చ ఉంది. టిడిపి టిక్కెట్లు రాకపోవడంతో జెడి రాజశేఖర్‌, రమేష్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండడంతో టిడిపి ఓట్లు చీలే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ నుంచి బాలగురు బాబు పోటీలో ఉన్నారు. సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ టిడిపి నుంచి, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కిలివేటి సంజీవయ్య వైసిపి నుంచి విస్తృత ప్రచారం గావిస్తున్నారు. సంజీవయ్య కబ్జాలు, అవినీతి అక్రమాలే తమను గెలిపిస్తాయని టిడిపి ధీమా. వైసిపికి బలమైన మండలాలు సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరుల్లో ‘పెద్దలు’ ఆశీస్సులు తనకే ఎక్కువగా ఉన్నాయని సంజీవయ్య చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి సూళ్లూరుపేటకు చెందిన శివ పోటీలో ఉన్నారు. వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, టిడిపి తరపున మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ హోరాహోరీగా తలపడుతున్నారు. పంటా శ్రీనివాసులు కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. వైసిపి ఓట్లే చీల్చే అవకాశం కనిపిస్తోంది. గూడూరులో టిడిపి నుంచి పాశం సునీల్‌కుమార్‌, వైసిపి నుంచి మేరిగ మురళీ మధ్య పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. వైసిపి నుండి తమ పార్టీలో చేరికలతో తమ గెలుపు సునాయాశమని సునీల్‌కుమార్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌ రామకృష్ణ పోటీలో ఉన్నారు. కోట పరిసర ప్రాంతాల్లో వైసిపికి పడే ఓట్లలో కొన్ని డాక్టర్‌ రామకృష్ణకు పడే అవకాశం ఉంది.

➡️