సంజూ శాంసన్‌కు భారీ జరిమానా విధింపు

May 8,2024 14:44 #Cricket, #IPL 2024 Match, #Sports

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తనను ఔట్‌గా ప్రకటించడంతో థర్డ్‌ అంపైర్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు.
రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నాలుగవ బంతిని క్రీజులో ఉన్న సంజూ శాంసన్‌ భారీ షాట్‌ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు షాయ్ హౌప్‌ బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ పట్టాడు. దీంతో నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కు అప్పగిస్తూ ఫీల్డ్‌ అంపైర్లు కేఎన్‌ అనంతపద్మనాభన్‌, ఉహాస్‌ గాంధే రిఫర్‌ చేశారు. మూడు నాలుగు కెమెరా యాంగిల్స్‌లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ మైఖేల్‌ గోఫ్‌.. సంజూ శాంసన్‌ ఔట్‌గా తేల్చారు. ఈ నిర్ణయం పట్ల సంజూ శాంసన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్‌ అంపైర్ల వద్దకు వెళ్లి తన అసంతప్తిని వ్యక్తం చేశాడు. ఈ విధంగా వ్యవహరించడం ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. సంజూ శాంసన్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

➡️