ఆఫ్ఘనిస్తాన్ : గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా ఆఫ్ఘనిస్తాన్లో కురుస్తోన్న భారీ వర్షాలకు దాదాపు 33మంది మృతి చెందారు. మరో 27మందికి గాయాలయ్యాయి. దీనిపై తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం అధికారికంగా సమాచారమిచ్చారు. ఆకస్మిక వరదలు రాజధాని కాబూల్తో పాటు పలు ప్రావిన్సులను ప్రభావితం చేశాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ తాలిబన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు. 600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయని, దాదాపు 200 పశువులు చనిపోయాయని చెప్పారు. వరదల కారణంగా దాదాపు 800 హెక్టార్ల వ్యవసాయ భూమి, 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సులు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని 34 ప్రావిన్సుల్లో చాలా వరకు రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది.