అబుజా: నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలో నుంచి సాయుధ దుండగులు ఒక పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను అపహరించుకుపోయి వారం రోజులు దాటింది. అయినా చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే చిన్నారులను విడుదల చేయడం కోసం ఆ దుండగులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నానట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ‘ఒక బిలియన్ నైరాలు(రూ.5.15 కోట్లు) ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. కిడ్నాప్ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో ఆ మొత్తం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే.. అందరినీ చంపేస్తామని బెదిరించారు’ అని మీడియా తెలిపింది. గతవారం పాఠశాల కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్న తరుణంలోనే ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని కాల్చిచంపారు. 287 విద్యార్థుల్ని సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. అపహరణకు గురైనవారి ఆచూకీ కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి.