ముంబయి : కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించాలని ఎదురుచూస్తున్న ముంబయిని బాంబు బెదిరింపు కాల్స్ వణికిస్తున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాము బాంబులు పెట్టామని.. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ అవి ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చని బెదిరించాడు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబయి అంతా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వేడుకల వేళ నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐదు రోజుల క్రితం కూడా.. ముంబయిలోని ఆర్బీఐ ఆఫీసులు సహా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్.. ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరింపు మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి.. ఎక్కడా పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదని పోలీసులు తెలిపారు.