జైపూర్ : రాజస్థాన్లోని షేఖావతి ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపి రాహుల్ కశ్వన్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాహుల్ కశ్వన్ కాంగ్రెస్లో చేరారు. చురు నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు కశ్వన్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి రామ్ సింగ్ కశ్వన్ నాలుగు సార్లు విజయం సాధించారు. కశ్వన్ తాత దీప్ చంద్ కశ్వన్ స్వాతంత్య్ర సమర యోధులు, ఎంపిగానూ పనిచేశారు. బిజెపికి రాహుల్ కశ్వన్ రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.