రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

May 4,2024 12:15 #road accident, #Uttarakhand

ఉత్తరాఖండ్‌ : ఐదుగురు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌ లోని.. పానీవాలా బ్యాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌ ఐఎమ్‌ఎస్‌ కాలేజీకి చెందిన నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో పానీ వాలా బ్యాండ్‌ సమీపంలో లోతైన గుంటలో కారు పడిపోయింది. కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాన్సీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను అమన్‌సింగ్‌ రాణా (22), దింగ్యాంస్‌ ప్రతాప్‌ బాటి (23), తనూజా రావత్‌ (22), అశుతోష్‌ తివారి (24), హృదయాంశ్‌ చంద్ర (24) గా గుర్తించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని.. ఎస్‌పి సిటీ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు.

➡️