జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులోనలుగురికి యావజ్జీవం

Nov 26,2023 11:08 #four people, #Journalist, #Murder

న్యూఢిల్లీ : జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. మరో నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష ఖరారు చేసింది. హెడ్‌లైన్స్‌ టుడే న్యూస్‌ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన 25 ఏళ్ల సౌమ్యా విశ్వనాథన్‌ 2008 సెప్టెంబరు 30న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆఫీస్‌ ముగించుకుని కారులో ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో కారులో ఆమె మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత తలకు బుల్లెట్‌ గాయం వల్ల ఆమె చనిపోయినట్లు తెలిసింది. సిసిటివి ఫుటేజ్‌ కూడా దీనిని నిర్ధారించింది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లాను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా.. నేరం అంగీకరించారు. సౌమ్యా విశ్వనాథన్‌ను కాల్చి చంపి దోచుకున్నట్లు చెప్పారు. థ్రిల్లింగ్‌ కోసం ఈ హత్యలు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మిగతా నిందితులైన బల్జీత్‌ మల్లిక్‌, అక్షయ్ కుమార్‌తో పాటు సహకరించిన అజరు సేథీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2010 జూన్‌లో ఈ కేసుపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 15 ఏళ్ల పాటు విచారణ జరిపిన ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ఈ ఏడాది అక్టోబరులో ఐదుగురు నిందితులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్జీత్‌ మల్లిక్‌, అక్షరు కుమార్‌, అజరు సేథీని దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే కేసును విచారించిన ఢిల్లీ కోర్టు ఐదుగురు నిందితుల్లో నలుగురు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్జీత్‌ మల్లిక్‌, అక్షరు కుమార్‌కు తాజాగా జీవిత ఖైదు విధించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరి కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది. హత్యకు సహకరించిన అజరు సేథీకి మాత్రం మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

➡️