– బిజెపిపై ఓటర్లలో అసంతృప్తి
– ధరల పెరుగుదలపై 29 శాతం మంది ఆగ్రహం
– ఆ తర్వాత స్థానాల్లో నిరుద్యోగం, పేదరికం
– సిఎస్డిఎస్-పోస్ట్పోల్ డేటా
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ఈ ఏడాది జనవరి 22న ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమం కాదంటూనే.. అంతకు మించి హడావుడిని మోడీ సర్కారు ప్రదర్శించింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రారంభానికి మూడు నెలల ముందు దీనిని ప్రారంభించి, అందరి దృష్టినీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది. బిజెపి వ్యూహం లోక్సభ ఎన్నికల్లో ఫలించలేదు. అయోధ్యలో భాగంగా ఉన్న ఫైజాబాద్ పార్లమెంటు స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి.. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు.
అయోధ్యలో రామ మందిరం గురించి భారత ఓటర్లు ఏం భావిస్తున్నారు? ఇది ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపించిందన్న విషయంపౖౖె సిఎస్డిఎస్-పోస్ట్ పోల్ సమాచారం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రజలు రామమందిరం మాత్రమే కాకుండా సమస్యల పైనా మంచి అవగాహనను కలిగి ఉన్నారు. పలు సమస్యల విషయంలో మోడీ సర్కారుపై వారు అసంతృప్తిలో ఉన్నారు.
సిఎస్డిఎస్ సమాచారం ప్రకారం.. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ‘అత్యంత ఆమోదిత పని’ అనే బహిరంగ ప్రశ్నకు సమాధానంగా 22 శాతం మంది రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావించారు. పేదరికాన్ని తగ్గించటం, ఉపాధి అవకాశాలను సృష్టించటం వంటివాటిని బిజెపి ప్రభుత్వ రెండో, మూడో అత్యంత ఇష్టపడే పనులుగా వివరించారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ‘అత్యంత ఆమోదయోగ్యం లేని పని’ గురించిన బహిరంగ ప్రశ్నకు సమాధానంగా.. ‘ధరల పెరుగుదల’పై 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 27 శాతం మంది నిరుద్యోగాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వం వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న పేదరికం కూడా ప్రభుత్వ అత్యంత ఇష్టపడని పనులలో ఒకటిగా ఉందని 11 శాతం మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
రామమందిర నిర్మాణానికి ప్రజలు మద్దతు ఇస్తూనే.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి ఇతర సమస్యలతో సహా దేశంలో నెలకొన్న ఆర్థిక సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటుండటం గమనార్హం. ప్రజలకు ఓటు వేసే విషయంలో సామాజిక, రాజకీయ సమస్యల కంటే ఆర్థిక సమస్యలు ప్రాధాన్యతనిస్తాయని డేటా వెల్లడిస్తున్నది.
సిఎస్డిఎస్-లోక్నీతి ప్రీ-పోల్ అధ్యయనంలో ఒక బహిరంగ ప్రశ్నకు ప్రతిస్పందనగా.. ‘రామమందిరాన్ని’ ప్రభుత్వం అత్యంత ఇష్టపడే పనిగా పేర్కొన్న వారిలో నాలుగింట ఒక వంతు (25 శాతం మంది) నిరుద్యోగాన్ని అత్యంత ముఖ్యమైన ఓటింగ్ సమస్యగా గుర్తించారు. ప్రతి 10 మందిలో ఇద్దరు (22 శాతం మంది) ధరల పెరుగుదలను పేర్కొన్నారు. సాపేక్షంగా 19 శాతం మంది రామమందిర నిర్మాణాన్ని ముఖ్యమైన ఓటింగ్ సమస్యగా పరిగణించారు. బిజెపి పలు స్థిరమైన ప్రయత్నాలు చేసినప్పటికీ.. అయోధ్య అంశాన్నే ప్రజలు ఆధారంగా చేసుకోలేదన్నది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ రామ మందిర అంశమే కీలకమైతే, ఫైజాబాద్ వంటి కీలక స్థానంలో బిజెపి విజయం సాధించేదని వారు పేర్కొంటున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/37-11.jpg)