తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చి 17వ తేదీవరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. కేరళలో నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడవసారి అని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.