- సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం
- నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నుంచి 45 మంది నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. కాంగ్రెస్, టిఎంసి, ఆర్జెడి, ఎస్పిలతో సహా కనీసం సగం మంది ప్రతిపక్ష నాయకులు ‘కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం’ అంశాన్ని లేవనెత్తారు. జెఎంఎం అధ్యక్షులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వంటి నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడిని ఎత్తి చూపారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, హర్యానా కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడాపై కేంద్ర ఏజెన్సీల దాడిని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యారు యాత్రపై ‘హింసాత్మక దాడి’, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల అంశాన్ని కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారీ లేవనెత్తారు. దేశంలో ‘అలిఖిత నియంతృత్వం’ ఉంది. ‘దేశ రాజ్యాంగ చట్రం ప్రమాదంలో ఉంది. మేము దాని గురించి నిజంగా ఆందోళన చెందుతున్నాము. హేమంత్, లాలూ ప్రసాద్ వంటి ప్రతిపక్ష నేతల తర్వాత ఏజెన్సీల తీరుపై మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాం’ అని అన్నారు. హేమంత్ సోరెన్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ వంటి ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించిన తర్వాత తాను ఈ అంశాలను లేవనెత్తుతానని తివారీ చెప్పారు.
‘ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చాలా తీవ్రమైనది’ అని ఆర్జెడి ఎంపి అమరేంద్ర ధరిసింగ్ అన్నారు. ‘మేము మా ఆందోళనల గురించి ప్రభుత్వానికి, ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్కు తెలిపాం. రాష్ట్రానికి ఆర్థికసాయం కోరుతూ మా సిఎం నిరసనలో కూర్చుంటారని చెప్పాం. దురదృష్టవశాత్తు, రాజ్నాథ్ సింగ్ కూడా నిర్దిష్ట హామీ ఏమీ ఇవ్వలేదు’ అని టిఎంసి ఎంపి సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించాలి : ఎలమరం కరీం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వివిధ రాష్ట్రాల్లోని సిబిఐ, ఇడి, ఐటి వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని బిజెపి చేస్తున్న రాజకీయ విధ్వంసక ఎత్తుగడలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలని సిపిఎం రాజ్యసభ పక్షనేత ఎలమరం కరీం డిమాండ్ చేశారు. రాష్ట్రాల అధికారాలపై కేంద్రం దాడి, దేశాన్ని సమూలంగా మార్చడం, రైతులు, కార్మికుల ఆందోళనలు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్పైనా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న ఢిల్లీలో కేరళ ప్రభుత్వం ధర్నా చేస్తోందని కరీం తెలిపారు. పార్లమెంట్పై దాడి గురించి ప్రభుత్వం మౌనం వీడాలని సిపిఐ ఎంపి పి సంతోష్కుమార్ డిమాండ్ చేశారు. మణిపూర్లో శాంతియుత జీవితం ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం చెప్పగలదా? అని ఆయన ప్రశ్నించారు.
చర్చకు సిద్ధం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ‘రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం, బడ్జెట్ను సమర్పించే ఈ ముఖ్యమైన సెషన్లో ప్రతిపక్ష ఎంపిలందరి సహకారం మేము కోరాం. నినాదాలు చేయవద్దని, ప్లకార్డులు తీసుకురావద్దని ప్రతిపక్ష ఎంపిలను మళ్లీ అభ్యర్థిస్తాం’ అని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి, లోక్సభ ఉపనేత రాజ్నాథ్సింగ్, రాజ్యసభ నేత పీయూష్ గోయల్, సహాయ మంత్రులు అర్జున్రామ్ మేఘ్వాల్, మురళీధరన్, అనుప్రియ పటేల్ (అప్నాదళ్), కె సురేష్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యాయ, సుఖేదు శేఖర్రారు (టిఎంసి), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డిఎంకె), రాహుల్ షెవాలే (శివసేన), ఎలమరం కరీం, పిఆర్ నటరాజన్ (సిపిఎం), సంతోష్ కుమార్ (సిపిఐ), అమరేంద్ర ధారిసింగ్ (ఆర్జెడి), ఎస్టి హసన్ (ఎస్పి), రామ్నాథ్ ఠాకూర్ (జెడియు), జయదేవ్ గల్లా, కనకమేడల రవీంద్రకుమార్ (టిడిపి), భీశెట్టి సత్యవతి (వైసిపి), నామా నాగేశ్వరరావు, కె కేశవరావు (బిఆర్ఎస్), సస్మిత్ పాత్ర (బిజెడి), వైకో (ఎండిఎంకె), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్) తదితరులు పాల్గొన్నారు.